Afghanisthan: తునాతునకలైన 63 మంది శరీర భాగాలు.. ఏరులై పారిన రక్తం.. కాబూల్‌లో ఉగ్రవాదుల ఘాతుకం!

  • ఓటరు నమోదు కేంద్రంపై ఆత్మాహుతి దాడి
  • ఏం జరిగిందో తెలియక అరుపులు, కేకలతో హోరెత్తిన ప్రాంతం
  • పేలుడు ధాటికి నిలువునా కుప్పకూలిన రెండంతస్తుల భవనం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై ఐఎస్ ఉగ్రవాదులు మరోమారు విరుచుకుపడ్డారు. ఓటర్ల నమోదు కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మంది గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబరులో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాబూల్‌లో ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇందుకోసం ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు చేరుకున్నారు.

ఓటరు నమోదు కేంద్రం వద్దకు తాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళ సభ్యుడు కార్యాలయం గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. ఎటుచూసినా మాంసపు ముద్దలతో, రక్తంతో ఆ ప్రాంతం నిండిపోయింది. శరీర భాగాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. పేలుడుతో ఏం జరిగిందో తెలియక జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది.

పేలుడు ధాటికి రెండంతస్తుల ఓటు నమోదు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాలు కదిలిపోయాయి. అద్దాలు బద్దలయ్యాయి. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రకటించింది. సాయంత్రానికి ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన చేస్తూ దాడికి పాల్పడింది తామేనని పేర్కొంది.

ఆత్మాహుతి దాడిలో మరణించిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు, చిన్నారులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర బాఘ్లాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన మరో ఘటనలో బాంబు పేలి ఐదుగురు మరణించారు.
Afghanisthan
Islamic state
Suicide blast

More Telugu News