Balakrishna: హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్లలో బాలయ్యపై ఫిర్యాదులు

  • మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాలయ్య
  • బాలయ్య ఇంటిని ముట్టడించిన బీజేవైఎం
  • ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన రామ్ చందర్ రావు

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. విజయవాడలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షలో ప్రధాని మోదీని బాలయ్య పరుష పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణల్లోని బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని బాలయ్య నివాసాన్ని నిన్న బీజేవైఎం శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశాయి. కారులో బయటకు వెళ్తున్న బాలయ్యను అడ్డగించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం నేతలు నగరంలోని పలు స్టేషన్లలో బాలయ్యపై ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ పీఎస్ లో బీజేపీ నగర అధ్యక్షుడు రామ్ చందర్ రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్ పెక్టర్ జగన్ బీజేపీ నేతలతో మాట్లాడుతూ, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు బీజేపీ మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఉమామహేశ్వరిరెడ్డి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో బీజేపీ జూబ్లీహిల్స్ కన్వీనర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

More Telugu News