Pakistan: తీర్థయాత్రకు పాకిస్థాన్ వెళ్లి.. ముస్లింగా మారి అక్కడి వ్యక్తిని పెళ్లాడిన సిక్కు మహిళ!

  • ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియా ద్వారా లాహోర్ వ్యక్తితో పరిచయం
  • తాజాగా తీర్థయాత్ర పేరుతో వెళ్లి మతం మార్చుకుని రెండో వివాహం
  • తన కోడలిని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ మామ వేడుకోలు

తీర్థయాత్ర కోసం పంజాబ్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఓ సిక్కు మహిళ మతం మార్చుకుని ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది. హోషియాపూర్‌లోని గర్‌శంకర్ పట్టణానికి చెందిన కిరణ్ బాల (31)కు ఇది వరకే వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన లాహోర్‌కు చెందిన మొహమ్మద్ ఆజంను పెళ్లాడేందుకు తన ముగ్గురు పిల్లలను మామయ్య వద్ద వదిలేసి పాకిస్థాన్ చేరుకుంది. అక్కడ మతం మార్చుకుని ప్రియుడిని పెళ్లాడింది.

తీర్థయాత్రల కోసం పాకిస్థాన్ వెళ్లి అక్కడి వ్యక్తిని పెళ్లాడడంపై భారత అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇది ముమ్మాటికీ భారత ఇంటెలిజెన్స్ అధికారుల తప్పిదమేనని శిరోమణి గురుద్వారా నిర్వహణ కమిటీ ఆరోపించింది.

పాకిస్థాన్‌లోని ‘జాతా’ అనే పవిత్ర స్థలాన్ని ప్రతి ఏడాది భారత్‌లోని సిక్కులు సందర్శిస్తుంటారు. అక్కడికి వెళ్లేందుకు భక్తులు పెట్టుకున్న దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన అనంతరం వారికి అనుమతి ఇస్తారు. ఈసారి జాతాకు 1800 మంది వెళ్లారు.

జాతా వెళ్లిన అనంతరం కిరణ్ ఇస్లాం మతాన్ని పుచ్చుకుని తన పేరును అమ్నా బీబీగా మార్చుకుంది. కాగా, తన కోడలిని తిరిగి భారత్ రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా ఆమె మామ, మాజీ మతపెద్ద తార్సెం సింగ్ విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను అభ్యర్థించారు.

కిరణ్ బాల అలియాస్ అమ్నా బీబీ మాట్లాడుతూ.. ముహమ్మద్ ఆజంను తాను ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా కలిసింది చెప్పేందుకు నిరాకరించింది. మతం మారేందుకు తనను ఎవరూ బలవంతం పెట్టలేదని, తన ఇష్ట ప్రకారమే మారానని చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరూ తనను ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది. కాగా, తన కోడలు ఐఎస్ఐ మాయలో పడిందని, ఆమెను తిరిగి భారత్‌కు రప్పించే చర్యలు తీసుకోవాలని తార్సెం సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కోరారు.

More Telugu News