Beautisian: టీవీ చానల్ ముందు ప్రత్యక్షమైన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు సందీప్!

  • మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో జ్యోతి మృతి
  • ఘటనతో తనకు సంబంధం లేదన్న సందీప్
  • పోలీసులు గాలిస్తుండగా టీవీ చానల్ లో ప్రత్యక్షం

మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరుకు రైలులో వెళుతూ, పట్టాలపై విగతజీవిగా కనిపించిన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు ఓ టీవీ చానల్ ముందు ప్రత్యక్షమై, ఆమె మృతితో తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పాడు. జ్యోతి మృతి వెనుక సందీప్ హస్తం ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలి అనుమానితుడిగా సందీప్ పేరునే చేర్చిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్, తనను అనవసరంగా అనుమానిస్తున్నారని, ఆరోజు రైలులో ఏం జరిగిందో తేలాల్సి వుందని చెప్పాడు. జ్యోతి చాలా తెలివైన అమ్మాయని, ఇద్దరమూ పెళ్లి చేసుకోవాలని, అందుకు ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకోవాలని భావించామని చెప్పాడు. రెగ్యులర్ గా తాము ప్రతి ఆదివారం కలుస్తుంటామని, తాను అమ్మమ్మ వాళ్ల ఇంటికి వస్తున్నానని, అక్కడ కలుద్దామని చెప్పిందని, ఆపై జ్యోతి కనిపించడం లేదని వాళ్ల ఇంటి నుంచే తనకు ఫోన్ వచ్చిందని చెప్పాడు. వెంటనే తన స్నేహితుడిని తీసుకుని వికారాబాద్ కు వెళ్లానని అన్నాడు. జ్యోతి మరణం తనను కలచి వేసిందని చెప్పాడు. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని, ఆమె చనిపోయిన తరువాత వాళ్ల ఊరికి వెళితే, తనను కొడతారని భయపడే వెళ్లలేదని సందీప్ అన్నాడు.

More Telugu News