Twitter: ఏపీలోనూ కథువా, ఉన్నావో పరిస్థితి: జగన్ ట్వీట్

  • మానవత్వం మంటగలిసిందనడానికి ఆ రెండు ఘటనలే సాక్ష్యాలు
  • కఠిన శిక్షలు విధించాలి
  • గతేడాది వైజాగ్‌లోనూ ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి 
  • పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడి

ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో మనం విఫలం చెందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని కథువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై జగన్ ట్వీట్‌ చేస్తూ... మానవత్వం మంటగలిసిందనడానికి ఆ రెండు ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదని అన్నారు.
 
ఏపీలోనూ ఇటువంటి పరిస్థితి తీసిపోలేదని, గతేడాది అక్టోబర్‌ 17న వైజాగ్‌ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగిందని, అనంతరం డిసెంబర్‌లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారని పేర్కొన్నారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టకూడదని, ఏ ఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.   

More Telugu News