punam kaur: ఒబామాని కలిశా.. రాయలేదు.. మానుషి చిల్లార్‌ను కలిశా.. వార్తలేదు.. తప్పుడు వార్తలు మాత్రం రాస్తున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

  • మీడియాపై నటి పూనమ్ కౌర్ అసహనం
  • మంచి పనిచేస్తే ఒక్క వార్త కూడా కనిపించదని వ్యాఖ్య
  • తప్పుడు వార్తలపై మాత్రం మీడియా చర్చలు పెడుతుందన్న చేనేత బ్రాండ్ అంబాసిడర్

ప్రముఖ సినీ నటి, ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ కోసమే పాకులాడుతోందని, తప్పుడు వార్తలను రాసేందుకు చూపుతున్న శ్రద్ధ.. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, స్వచ్ఛంద సేవకురాలిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను, విశ్వసుందరి మానుషి చిల్లార్‌ను కలిసినా పట్టించుకోని మీడియా, తనపై తప్పుడు వార్తలు రాసేందుకు మాత్రం ఉవ్విళ్లూరుతోందని అన్నారు. కశ్మీర్, విశాఖపట్టణంలలో జరిగిన ప్రకృతి విధ్వంసాలపై విరాళాల కోసం స్వచ్ఛందంగా పనిచేశానని పూనమ్ తెలిపారు. అయినా ఒక్క వార్త కూడా మీడియాలో రాలేదన్నారు. కానీ, ఫేక్ న్యూస్‌పై మీడియాలో చర్చోపచర్చలు జరుగుతాయని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నటి శ్రీదేవి చనిపోతే కూడా ఎన్నో కల్పిత వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

More Telugu News