Chandrababu: ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్నానంటూ చంద్రబాబు సంచలన ప్రకటన!

  • పుట్టినరోజు నాడు చంద్రబాబు నిరాహారదీక్ష
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష
  • కేంద్రం తీరును నిరసిస్తూ దీక్ష చేయనున్న సీఎం

నిరాహారదీక్షను చేయబోతున్నానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధాని మోదీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంటు జరగకపోవడానికి కారణం మీరే కదా? అని ఆయనను తాను అడుగుతున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు.

ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను తెస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. 

More Telugu News