KCR: డిండి ఎత్తిపోతల పథకం పేరును మార్చిన తెలంగాణ ప్రభుత్వం

  • డిండి ప్రాజెక్టుకు 'ఆర్.విద్యాసాగర్ రావు' పేరు
  • ఫైలుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • విద్యాసాగర్ రావు చివరి కోరిక కూడా తీర్చామన్న సీఎం    

ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’ గా పరిగణించాలని నీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణపై జరిగిన వివక్షను ఆర్.విద్యాసాగర్ రావు ఎలుగెత్తి చాటారని, సంక్షిష్టమైన విషయాలను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. విద్యాసాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారని, దీనికోసం అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

More Telugu News