Telugudesam: టీడీపీ సీనియర్ నేత రావి శోభనాద్రి కన్నుమూత

  • రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావి
  • ఆపై కుమారులకు వారసత్వం
  • వృద్ధాప్య కారణాలతో నేడు మృతి
  • సంతాపం తెలిపిన టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి చౌదరి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలతో ఆయన సహజ మరణం పొందినట్టు కుటుంబీకులు తెలిపారు. గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రావి శోభనాద్రి రెండు పర్యాయాలు విజయం సాధించారు. గుడివాడ ప్రాంతంలో మంచి పట్టున్న ఆయన కుటుంబం, ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు.

రావి శోభనాద్రి చౌదరి కుమారుడు రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావుపై ఆయన ఓడిపోయారన్న సంగతి తెలిసిందే. శోభనాద్రి చౌదరి పెద్ద కుమారుడు 1999లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై రోడ్డు ప్రమాదంలో మరణించగా, 2000లో జరిగిన ఉప ఎన్నికలతో వెంకటేశ్వరావు రాజకీయాల్లోకి వచ్చారు. కాగా, దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న రావి శోభనాద్రిచౌదరి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

More Telugu News