Andhra Pradesh: ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకే ప్రాధాన్యమివ్వాలి : ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • ఇళ్ల స్థలాలకు కేవలం పట్టాలు మంజూరు చేస్తే సరిపోదు
  • గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులును ఎంపిక చేయాలి
  • పేదల సొంతింటి కలను నెరవేర్చాలి

ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీటిడ్కో, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత, రాష్ట్రంలో ఇంత వరకూ ఎన్ని పట్టాలు మంజూరు చేశారనే విషయాన్ని తెలియజేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్రంలో 2014 నుంచి నేటి వరకూ 3,45,853 ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఇళ్ల స్థలాల పట్టాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 19.82 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో 5,98,118 మందిని అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 2,99,246 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 2,98,872 మంది ఉన్నారన్నారు. తాజాగా 5,98,118 మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని వివరించారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలకు కేవలం పట్టాలు మాత్రమే మంజూరు చేయడం వల్ల పేదలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గృహ నిర్మాణ పథకాల కింద వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. తద్వారా పేదలకు పక్కా ఇళ్లు కట్టుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. అందరికీ ఆవాసం కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందని అన్నారు.

జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణ వేగవంతం చేయండి

విజయవాడ కార్పొరేషన్ లో 24 గంటలూ తాగునీటి కల్పన, జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణంపై ప్రగతి గురించి దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, వృథాగా పోతున్న తాగునీటికి అడ్డుకట్టవేయాలని,  ఈ టౌన్ షిప్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News