Rape: రేప్ చేసేందుకు 580 కి.మీ ప్రయాణించిన నిందితుడు... ఖతువా అత్యాచార కేసులో సంచలన నిజాలు!

  • జనవరిలో కలకలం రేపిన అత్యాచారం
  • 8 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం
  • ఆపై అడవిలో మృతదేహం పారవేత
  • ఘటనలో పోలీసులకూ భాగస్వామ్యం

జమ్మూ కశ్మీర్ లో తీవ్ర సంచలనం సృష్టించిన ఖతువా అత్యాచార ఘటనలో పోలీసులు 15 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేస్తూ, అందులో విస్తుపోయే నిజాలను పొందుపరిచారు. గత జనవరిలో 8 సంవత్సరాల బాలిక సామూహిక అత్యాచారానికి బలై, హత్యకు గురి కాగా, ఆపై తీవ్ర నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరుగురు నిందితులు వారం రోజుల పాటు బాలికను బంధించి ఓ ప్రార్థనా మందిరంలో ఉంచి నిత్యమూ అత్యాచారం చేశారని, బాలికను ఎప్పుడూ మత్తులోనే ఉంచారని తెలిపారు. వీరిలో ఐదుగురు అదే ప్రాంతానికి చెందిన వారు కాగా, మీరట్ లో ఉన్న తమ స్నేహితుడిని అత్యాచారం చేసేందుకు ఆహ్వానించారని, అతను 580 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూ చేరుకున్నాడని తెలిపారు.

ఈ ఘటనను ఓ ప్రణాళిక ప్రకారం నిందితులు జరిపారని, ఖతువా సమీపంలోని రాసన్నా ప్రాంతంలో నివసించే భకేర్వాల్ వర్గాన్ని తీవ్ర భయకంపితులను చేయడమే వారి ఉద్దేశమని కశ్మీర్ పోలీసులు తమ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ప్రార్థనా మందిరం కేర్ టేకర్ గా ఉన్న సంజీ అనే వ్యక్తి మొత్తం నేరానికి బాధ్యుడని తెలిపారు. అత్యాచార నిందితుల్లో సంజీతో పాటు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, వారి స్నేాహితులు పర్వేష్ కుమార్, సంజీ మేనల్లుడు, సంజీ కుమారుడు కూడా నిందితులేనని పేర్కొన్నారు.

ఆ బాలికను చంపేసే ముందు కూడా అత్యాచారం చేశారని, ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేందుకు తలపై బరువైన బండరాయితో మోదారని తెలిపారు. కేసులో మైనర్ నిందితుడైన సంజీ మేనల్లుడు బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లి అడవుల్లో పారేశాడని తెలిపారు. కేసు విచారణ క్రమంలో పక్కదారి పట్టించేందుకు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు హెడ్ కానిస్టేబుళ్లు తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దుత్తాలు రూ. 4 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఈ కేసులో భాగస్వామ్యమైన అందరికీ కఠిన శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు.

More Telugu News