Indrani Mukherjea: నన్ను చంపేయడం ఖాయం.. ఇంద్రాణి ముఖర్జియా!

  • ఐఎన్ఎక్స్ కేసులో తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఇంద్రాణి
  • సీబీఐ పర్యవేక్షణలో ఉంచాలని వేడుకోలు
  • నాగ్‌పడా పోలీసులకు వాంగ్మూలం

కుమార్తె షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా  తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్‌పడా పోలీసులకు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలంలో.. తన ప్రాణాలకు హాని ఉందని, తనను సీబీఐ రక్షణలో ఉంచాలని వేడుకున్నారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న ఓ ఆర్థికపరమైన కేసులో ఆమె ప్రధాన సాక్షిగా వుంది.

 యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్రవారం రాత్రి ఆమెను జేజే ఆసుపత్రికి తరలించారు. సోమవారం నాగ్‌పడా పోలీసుల బృందం ఆసుపత్రికి వచ్చి ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఇంద్రాణి బుధవారం తిరిగి జైలుకు చేరుకుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత కుమారుడిపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఆధ్వర్యంలోని 9ఎక్స్ మీడియాగా చిరపరిచితమైన ఐఎన్ఎక్స్ మీడియా ఆయనకు ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి.

కాంగ్రెస్ నేత కార్యాలయంలోనే తాము కలిశామని పీటర్, ఇంద్రాణి ముఖర్జియా గతంలో పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆదాయపన్ను శాఖ కొన్ని వ్యత్యాసాలు గుర్తించడంతో బయటపడేయాల్సిందిగా ఆయనను కోరినట్టు ఆరోపించారు. దీంతో ఆ కాంగ్రెస్ నేత ఆ పనిని తన కుమారుడికి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అతడిని కలిశామని, సమస్య పరిష్కారం కోసం మిలియన్ డాలర్లు అడిగినట్టు తెలిపారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంద్రాణి ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో 40 మంది ఖైదీలతో కలిసి సాధారణ బ్యారక్‌లో ఉన్న ఆమెను ప్రస్తుతం మరో ఇద్దరితో కలిసి ప్రత్యేక సెల్‌లో పెట్టారు.

More Telugu News