Natti kumar: ఆరుగురు సినీ పెద్దలపై నట్టి కుమార్ సంచలన ఆరోపణలు!

  • వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ఒక్క తాటిపైకి వద్దాం
  • ఒక రోజు అన్నీ బంద్ చేద్దాం
  • ఆ ఆరుగురు స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబును కలిశారు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి ఉద్యమించాలని ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తెలుగు చిత్రసీమకు పిలుపునిచ్చారు. హోదా కోసం చిత్ర పరిశ్రమ ఏక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక తేదీని నిర్ణయించి బంద్ పాటించి, దీక్షకు కూర్చునేందుకు నటులు ముందుకు రావాలని అన్నారు. హైదరాబాద్‌తోపాటు ఏపీలోనూ నిరసనలు తెలుపుదామని పేర్కొన్నారు. బంద్‌తో పాటు ఆ రోజు సినిమా షూటింగ్‌లు కూడా నిలిపివేయాలని, సినిమా ప్రదర్శన కూడా నిలిపివేసి నిరసన తెలపాలని అన్నారు.  

అలాగే, చిత్ర పరిశ్రమకు చెందిన ఆరుగురిపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎవరికీ తెలియకుండా ఆరుగురు సినీ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని, ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపారని అన్నారు. చిత్ర పరిశ్రమ మొత్తాన్ని కలుపుకుని పోవాల్సిన వారు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసమే వెళ్లారని ఆరోపించారు. వైసీపీ, జనసేన, సీపీఎం, సీపీఐలను కలవకుండా చంద్రబాబును మాత్రమే కలవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయని నట్టి కుమార్ పేర్కొన్నారు.

More Telugu News