Motihari: వారంలో 8.5 లక్షల టాయిలెట్లు నిర్మించామన్న మోదీ... ఒక్క ట్వీట్ తో కంగు తినిపించిన తేజస్వీ యాదవ్!

  • మోతీహారిలో చంపారన్ సత్యాగ్రహ శత వార్షికోత్సవ సభ
  • ప్రసంగించిన నరేంద్ర మోదీ
  • నిమిషానికి 84 టాయిలెట్లు కట్టించారా?
  • బీహార్ సీఎం కూడా నమ్మబోరన్న తేజస్వీ యాదవ్

బీహార్ లో ప్రభుత్వం చక్కగా పనిచేస్తున్నదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నితీశ్ కుమార్ పాలన సాగిస్తున్నాడని చెబుతూ, కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 8.5 లక్షల టాయిలెట్లను నిర్మించామని, అభివృద్ధి అంటే ఇదేనని అన్న వేళ, విపక్ష నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

మోతీహారీలో జరిగిన చంపారన్ సత్యాగ్రహం శత వార్షికోత్సవ సభలో ప్రసంగించిన ఆయన, 20 వేల మంది స్వచ్ఛ గ్రాహీలను నియమించనున్నట్టు తెలిపారు. ఇక వారంలో 8.5 లక్షల టాయిలెట్లను కట్టడమంటే, నిమిషానికి 84 టాయిలెట్లను కట్టినట్టు అవుతుందని లెక్కలతో సహా చెబుతూ, ఇంతకన్నా మోసపు మాటలు మరెక్కడా ఉండవని, కనీసం బీహార్ సీఎం కూడా ప్రధాని చెప్పిన మాటలను విశ్వసించబోరని వ్యాఖ్యానించారు.

కాగా, బీహార్ ప్రభుత్వం మార్చి 13 నుంచి ఏప్రిల్ 9 మధ్య 8.5 లక్షల టాయిలెట్లను నిర్మించిందని, వాటిల్లో సగం మోదీ ప్రస్తావించిన వారం కన్నా ముందు నిర్మించినవేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటి జియో ట్యాగింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలిపాయి.

More Telugu News