Hyderabad: రైలు ప్రమాదం కాదు... ప్రియుడి కోసం భర్తను హత్య చేయించింది!

  • బోరబండ సమీపంలో ఫిబ్రవరి 21న మృతదేహం
  • తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు
  • విచారణలో తేలిన నిజం

హైదరాబాద్, బోరబండ సమీపంలో రైలు పట్టాలపై ఫిబ్రవరి 21న విగతజీవిగా కనిపించిన మహ్మద్ ఖాజా మృతి ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన భార్య సలేహా బేగం, ప్రియుడిని వదిలి ఉండలేక అతనితో కలసి ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిందని పోలీసులు తేల్చారు. తొలుత రైలు ప్రమాదంగా భావించి దర్యాఫ్తును ప్రారంభించిన పోలీసులకు, అక్కడి సమీపంలోని బండరాళ్లపై రక్తపు మరకలు ఉండటం, మృతుడి తలపై బండరాళ్లు మోదినట్టు కనిపించడంతో హత్యగా భావించి, కేసును మరింత లోతుగా విచారించి నిజాన్ని తేల్చారు.

తమ ఇంటికి సమీపంలో ఉండే మహ్మద్ తబ్రేజ్ ఖురేషితో పరిచయం పెంచుకున్న సలేహా, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఈ విషయంలో ఖాజా పలుమార్లు తన భార్యను మందలించాడని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఎలాగైనా భర్తను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ప్రియుడితో కలసి ఆమె ఓ పథకాన్ని రూపొందించిందని, అందులో భాగంగా రూ. 2 లక్షలు ఇస్తానని చెబుతూ తబ్రేజ్ ఖురేషీ ముగ్గురితో సుపారీ కుదుర్చుకున్నాడని వెల్లడించారు.

వీరంతా కలసి ఖాజాను తీసుకెళ్లారని, రైలు పట్టాల సమీపంలో మద్యం తాగించి, ఆపై బండరాళ్లతో మోది చంపారని, మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. భర్త ఇంటి నుంచి వెళ్లిన గంటల వ్యవధిలోనే సలేహా పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ మరుసటి రోజే అతని మృతదేహం కనిపించడంతో తమకు వచ్చిన అనుమానమే కేసును ఛేదించేందుకు సహాయపడిందని అన్నారు.

More Telugu News