KTR: హైదరాబాద్ ఎంఎంటీఎస్‌, మెట్రో రెండో దశ పనులపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమీక్ష

  • బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో సమీక్ష
  • రైల్వే అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలపై సూచనలు
  • బ్రిడ్జీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న కేటీఆర్‌
  • ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో పనుల వేగం పెంచాలని సూచన

హైదరాబాద్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్‌ఎంసీ, రైల్వే శాఖల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై ఈ రోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో సంబంధిత అధికారులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రెండవ దశ పనులపై కూడా కేటీఆర్ ఈ సమావేశంలో చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ యాదవ్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా ఎంఎంటీఎస్‌ రెండవ దశ పనులతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీ (అర్‌యూబీ, అర్ఓబీ)లపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటు చర్లపల్లి రైల్వే టెర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. రైల్వే, జీహెచ్‌ఎంసీల మధ్య సమన్వయం కోసం ఉమ్మడిగా నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆనంద్ బాగ్, హైటెక్ సిటీ-కూకట్ పల్లి, తుకారం గేట్, బొల్లారం, ఖైత్లాపూర్, చర్లపల్లి, శాస్త్రీపూర్, ఫలక్ నుమా, ఉప్పుగూడ వంటి 10కి పైగా అర్‌యూబీలు, అర్వోబీల పనుల పురోగతిపైన మంత్రి కేటీఆర్‌.. రైల్వే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కొన్ని చోట్ల భూసేకరణ, వరద కాల్వల నిర్మాణం, అప్రోచ్ రోడ్డు గుర్తింపు వంటి పనుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, రైల్వే అధికారులు కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న బ్రిడ్జీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి  కేసీఆర్‌ సూచనపై  రైల్వే జీఎం సానూకూలంగా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేస్తామన్నారు. నగరంలో ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సార్డీపి, రోడ్డు విస్తరణ కార్యకలాపాలకు అవసరం అయిన భూములను ఇవ్వాలని మంత్రి రైల్వే జీఎం వినోద్ ను కోరారు.

గతంలో ఇదే విషయంలో రైల్వే శాఖ మంత్రిని కలిసినప్పుడు అయన నుంచి వచ్చిన సానుకూల హామీని గుర్తు చేశారు. రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో మరో 15 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశం నాటికి నాగులపల్లిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మల్టీమోడల్ లాజిస్టిక్స్ పైన పూర్తి వివరాలతో రావాలని హెచ్ఎండీఏ కమిషనర్‌ను కేటీఆర్‌ ఆదేశించారు.

పనుల పురోగతిపై సమీక్ష..
అలాగే, మెట్రో రైల్ పనులపైన కూడా కేటీఆర్‌ సమీక్షించారు. మెట్రోరైల్ అధికారులతో పాటు, ఎల్ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో మెట్రో రైల్ రెండవ దశ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్, హైటెక్ సిటీ, జేబీఎస్‌ కారిడార్లలో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగం పెంచడంపైన కూడా మంత్రి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

More Telugu News