Tollywood: నాకేమైనా అయితే అందరి పేర్లూ 'మహా' టీవీలో వస్తాయి: శ్రీరెడ్డి వీడియో వార్నింగ్

  • అందరి గురించి 'మహా టీవీ'కి ముందే సాక్ష్యాలు అందించా
  • రెండున్నరేళ్లు సాక్షి టీవీ అన్నం తిన్నా
  • సాక్షి యాజమాన్యానికి ద్రోహం చేయలేదు, చేయను
  • ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన శ్రీరెడ్డి

ఫిల్మ్ చాంబర్ ముందు తన నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసిన తెలుగు న్యూస్ చానల్ పై వస్తున్న విమర్శలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పెడుతూ, తనకు జరిగిన అన్యాయాలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలూ 'మహా' టీవీకి అందించిన తరువాతనే సదరు చానల్ తన సమస్యను బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వచ్చిందని చెప్పింది.

తనను హత్య చేస్తారని భయంగా ఉందని, తనకేదైనా జరిగితే, అందరి పేర్లూ బుల్లితెరపై ప్రత్యక్షమవుతాయని హెచ్చరించింది. తన విషయంలో 'మహా టీవీ'కి సంబంధాన్ని అంటగడుతున్నారని, వారంతా తమ తమ ఇళ్లకు అంటగట్టినట్టేనని వ్యాఖ్యానించింది. శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోందని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని, ఆ చానల్ తనకు అన్నం పెట్టిందని, అటువంటి చానల్ ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాదని చెప్పింది.

తాను టీడీపీతో కుమ్మక్కు కాలేదని, తనకు రాజకీయ పార్టీలతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని అంది. పోరాటం చేస్తున్న తనకు మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసిందని, అటువంటి మీడియాపై నిందలేస్తే, అందరి జాతకాలనూ బయటపెడతానని హెచ్చరించింది. కొన్ని వందల మంది అమ్మాయిల మానాలు పోతున్నాయని, వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని చెప్పింది. శ్రీరెడ్డి వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News