Kodandaram: నన్ను చూస్తే ఇంత భయమెందుకు?: కేసీఆర్ కు కోదండరామ్ సూటి ప్రశ్న

  • తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణ
  • మండిపడ్డ కోదండరామ్
  • అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన జేఏసీ నేత

తనను చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత భయమెందుకని జేఏసీ నేత కోదండరామ్ ప్రశ్నించారు. కోదండరామ్ పెట్టిన తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతుండగా, సభకు అనుమతి ఇవ్వబోమని పోలీసు శాఖ స్పష్టం చేయడంపై కోదండరామ్ మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే తమ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

తాము ఎల్బీ స్టేడియం లేదా సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహించుకుంటామని పోలీసులను అనుమతి కోరగా, వారు నిరాకరించారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. కాగా, ఇప్పటికే తెలంగాణ జనసమితి పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై కోదండరామ్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

More Telugu News