Tamilnadu: జయలలిత మృతి కేసు... అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి సమన్లు!

  • జయలలిత మృతిపై విచారిస్తున్న కమిషన్
  • ఇప్పటికే ఆపోలో నుంచి నివేదిక
  • మరిన్ని వివరాల కోసం ప్రతాప్ రెడ్డి విచారణ
  • రెండు రోజుల్లో నోటీసులు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌, ఆమెకు తుది రోజుల్లో చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్‌ సీ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. విచారణకు రావాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జయలలిత మరణం మిస్టరీని సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు విచారణను వేగవంతం చేస్తూ, పలు కోణాల్లో ఎంక్వయిరీ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించింది.

ఇక, ఆమెకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షలు తదితరాలపై సమాచారం కోసం అపోలో హాస్పిటల్ కు సమన్లు పంపింది. ఇప్పటికే ఈ సమన్లకు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆసుపత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి, ఆపై వారంలోపు విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News