Chandrababu: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్ నీచంగా మాట్లాడుతున్నారు : టీడీపీ నేత గద్దె

  • బాబు రాజకీయ అనుభవం ముందు జగన్ కుట్రలు పనిచేయవు
  • చంద్రబాబు పుట్టిన రోజు తేదీని ‘420’గా అభివర్ణిస్తారా?
  • ఏప్రిల్ 20వ తేదీనే శంకరాచార్యులు, మహ్మద్ ప్రవక్త జన్మించారు

చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్ నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు జగన్ కుట్రలు పనిచేయవని అన్నారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు తేదీని ‘420’గా అభివర్ణించిన జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఏప్రిల్ 20 వ తేదీనే ఆది గురువు శంకరాచార్యులు, మహ్మద్ ప్రవక్త జన్మించారని, అదే నెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహానుభావులు కూడా జన్మించారని, జగన్ చేసిన వ్యాఖ్యలు హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రత్యేకహోదా కావాలంటూ హడావుడి చేస్తున్న జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

More Telugu News