క్షీణించిన వైసీపీ ఎంపీ మేకపాటి ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు!
- వాంతులు చేసుకున్న మేకపాటి
- ప్రథమ చికిత్స అందించిన ఏపీ భవన్ వైద్యులు
- చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలింపు
వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైద్యులు ఆసుపత్రికి తరలించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి వైసీపీ ఎంపీలు ఆమరణదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం మేకపాటి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి, హైబీపీతో ఆయన బాధ పడ్డారు. అయినప్పటికీ దీక్షను ఆయన కొనసాగించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వేదిక నుంచి కొంచెం పక్కకు వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో, ఏపీ భవన్ వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించి, ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారు. దీంతో, ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.