Tamilnadu: రజనీకాంత్ పార్టీ... 38 జిల్లా యూనిట్లు, 7 వేల మంది కార్యవర్గం

  • డిసెంబర్ 31న రాజకీయ రంగప్రవేశం ప్రకటన చేసిన రజనీకాంత్
  • 234 నియోజకవర్గాలకు 38 జిల్లా యూనిట్లను ఏర్పాటు చేసిన రజనీ
  • కార్యవర్గ సభ్యులకు నియామక పత్రం, గుర్తింపు కార్డుల అందజేత ప్రక్రియ ప్రారంభం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పకడ్బందీగా రాజకీయ పార్టీ ఏర్పాటును పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గత డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించిన రజనీకాంత్ సుదీర్ఘ కాలం పార్టీ ప్రజల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులను లోతుగా అధ్యయనం చేసిన ఆయన రజనీ మక్కల్‌ మండ్రం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో 32 జిల్లాల్లోని 234 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా 38 రజనీ మక్కల్‌ మండ్రం జిల్లా కార్యవర్గ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో దశలవారీగా ఏడు వేల మంది కార్యవర్గ సభ్యుల నియామకం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేసే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక మిగిలింది పార్టీ ప్రకటనేనని తెలుస్తోంది. 

More Telugu News