Guntur District: ప్రేమించడం లేదని కత్తితో దాడి... యువతితో పాటు, తల్లి, చెల్లికి కూడా గాయాలు!

  • వెల్డింగ్ దూకాణంలో పని చేసే మహ్మద్ జానీ
  • డిగ్రీ చదువుతున్న రమ్య
  • ప్రేమ పేరుతో వేధించి, కత్తితో గాయపరిచిన జానీ

ప్రేమ పేరుతో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరులో కలకలం సృష్టించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని అల్లీనగర్‌ కు చెందిన మహ్మద్‌ జానీ అలియాస్‌ చిన్నోడు వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తూ, యాదవ బజార్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని కొండపల్లి రమ్య వెంటపడి ప్రేమించమని వేధిస్తున్నాడు. దీంతో రమ్య విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం బయటకు పొక్కితే లేనిపోని సమస్యలొస్తాయని చెప్పిన తల్లి, విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఊరుకుంది.

దీనిని అలుసుగా తీసుకున్న జానీ.. రమ్య కాలేజీకి వెళ్తుండగా ఆపి, తనను ప్రేమించాలని, లేని పక్షంలో కత్తితో పొడిచి చంపుతానని బెదిరించాడు. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో, రమ్యను కాలేజీకి వెళ్లవద్దని కుటుంబ సభ్యులు సూచించారు. దాంతో ఆమె ఇంట్లోనే ఉంటోంది. విషయం తెలుసుకున్న జానీ తన స్నేహితులు శ్రీకాంత్‌, రజాక్‌ లతో ఆమె ఇంటికి వెళ్లి, ప్రేమించాలని చెబుతూ, ఆమె చేతులను కత్తితో గాయపరిచాడు. అడ్డొచ్చిన ఆమె తల్లి, చెల్లెలిపై కూడా దాడికి దిగాడు. అనంతరం తాను కూడా గాయపరుచుకుని పరారయ్యాడు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News