Rahul Gandhi: రాహుల్ పై దండ విసిరిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

  • ఘటనతో షాక్ కు గురైన భద్రతా సిబ్బంది
  • దండ విసిరిన వ్యక్తిని గుర్తించాలంటూ ఐజీ ఆదేశం
  • కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక

కర్ణాటకలోని తుముకూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో చేస్తుండగా... ఓ వ్యక్తి పూలమాల విసిరాడు. ఆ పూలమాల సరిగ్గా వచ్చి రాహుల్ మెడలో పడింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే, వెంటనే తేరుకున్న రాహుల్ గాంధీ మెడలో నుంచి పూలమాలను తీసివేసి... ప్రజలకు అభివాదం చేస్తూ, ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు కర్ణాటక సెంట్రల్ రేంజ్ ఐజీ వి.దయానంద ఈ ఘటనపై స్పందించారు. ఇది భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయం గురించి తనకు తెలియగానే, వెంటనే తుముకూరు ఎస్పీతో మాట్లాడానని, పూలమాల విసిరిన వ్యక్తిని గుర్తించాలని ఆదేశించానని చెప్పారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని... ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

More Telugu News