vasantha krishna prasad: వైసీపీలో చేరనున్న కృష్ణా జిల్లా టీడీపీ నేత!

  • పార్టీ మారనున్న వసంత కృష్ణప్రసాద్
  • కొన్ని రోజుల నుంచి వైసీపీ నేతలతో మంతనాలు
  • జగన్ సమక్షంలో పార్టీలో చేరికకు సన్నాహకాలు

ఏపీ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్న ఆయన... వచ్చే వారం ప్రజాసంకల్ప యాత్రలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.

1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు-2 స్థానం నుంచి ఆయనను రంగంలోకి దించాలని టీడీపీ భావించినప్పటికీ... కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో ఆయనకు నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తంగిరాల గెలుపుకు ఆయన కృషి చేశారు. తంగిరాల మరణించిన తర్వాత ఉప ఎన్నిక నుంచి ఆయనను దూరంగా ఉంచారు. ఆ తర్వాత పార్టీ పరంగా కూడా పెద్ద ప్రాధాన్యత దక్కలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను ఒకటి, రెండు సందర్భాల్లో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, వైసీపీలోకి చేరేందుకు ప్రస్తుతం ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది. 

More Telugu News