Hyderabad: హైదరాబాద్‌లో వైజాగ్‌కి చెందిన వివాహిత అనుమానాస్పద మృతి

  • మెడపై గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతి
  • భర్త విధులకు వెళ్లిన తర్వాత ఘటన
  • పోలీసుల కేసు నమోదు...దర్యాప్తు

ఇటీవల కాలంలో క్షణికావేశంలోనో లేదా మరేదైనా ఇతర చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైపోతోంది. తల్లిదండ్రులు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల చివరకు పిల్లలు అనాథలవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో గిట్టనివారు పగతో కడతేరుస్తున్నారు. అలా జరిగినా కూడా చివరకు బాధితులు మాత్రం పిల్లలే.

తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో వైజాగ్‌కి చెందిన వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల్లోకెళితే....ఎర్రగడ్డలోని శంకర్‌లాల్ నగర్‌లో నివసించే వైజాగ్‌కి చెందిన సౌమ్య (28) అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె గొంతుపై కత్తిగాటు ఉంది.

ఓ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేసే తన భర్త నాగభూషణం సోమవారం రాత్రి విధులకు వెళ్లిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో ఆమెను ఎవరో హత్య చేశారన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సౌమ్య-నాగభూషణం దంపతులు నాలుగేళ్ల కిందట నగరానికి వచ్చారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

More Telugu News