Police: పిల్లాడిని తెల్లగా మార్చేందుకు రాయితో రుద్దుతోన్న మహిళ.. తీవ్రగాయాలు.. అరెస్ట్‌

  • ఓ ఆశ్రమం నుంచి చిన్నారిని దత్తత తీసుకున్న టీచర్‌
  • బాలుడు నల్లగా ఉండడంతో తెల్లగా మార్చాలని నిర్ణయం
  • ఒకరు చెప్పిన సలహా విని ప్రయత్నాలు
  • ఉత్తరాఖండ్‌లో ఘటన

ఉత్తరాఖండ్‌లో సుధ తివారి అనే టీచర్‌.. తన దత్తపుత్రుడిపై పాల్పడ్డ చర్య వల్ల ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆ రాష్ట్రంలోని నిషత్‌పూర్‌లో నివాసం ఉంటోన్న సుధా తివారికి పిల్లలు లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం తన భర్తతో కలిసి వెళ్లి ఓ ఆశ్రమం నుంచి ఒక బాలుడిని దత్తత తీసుకుంది. అయితే, ఆ బాలుడు నల్లగా ఉండటంతో ఆమెకు నచ్చలేదు. దీంతో సుధ తివారి ఆ బాలుడిని తెల్లగా మార్చాలనుకుంది.

ఈ క్రమంలో రాయితో శరీరంపై రుద్దితే తెల్లగా అవుతారని ఒకరు చెప్పిన సలహాను నిజమనుకుని ఆ పని చేయడం ప్రారంభించింది. అలా చేస్తే ప్రమాదమని సుధ సోదరి కూతురు శోభన శర్మ పలుసార్లు చెప్పింది. అయినప్పటికీ ఆమె మాటలను పట్టించుకోకుండా ఆ బాలుడి ఛాతీ, భుజం, వీపు, కాళ్లపై.. సుధా ప్రతిరోజు రాయితో రుద్దుతోంది.

ఆ బాలుడి శరీరంపై గాయలను గుర్తించిన శోభన బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. నిషత్‌పూర్‌ పోలీసులతో సుధ తివారి ఇంటికి వచ్చిన బాలల సంరక్షణ అధికారులు.. ఆ బాలుడిని విడిపించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News