uttarkashi: గంగోత్రికి తెగిన సంబంధాలు... కుప్పకూలిన పొడవైన వంతెన

  • భారీ లోడ్ ట్రక్ రావడంతో కూలిపోయిన ఉక్కు వంతెన
  • ఏప్రిల్ 18 నుంచి మొదలయ్యే చార్ ధామ్ యాత్రకు ఆటంకాలు
  • ప్రత్యామ్నాయ మార్గంపై అధికారుల దృష్టి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రికి రహదారి సంబంధాలు తెగిపోయాయి. గంగోత్రి-ధరసు జాతీయ రహదారిపై ఉత్తరకాశి జిల్లా కేంద్రాన్ని గంగోత్రికి అనుసంధానించే పొడవైన వంతెన కుప్పకూలింది. దీంతో పుణ్యక్షేత్రానికి, చైనా సరిహద్దుల్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు అవుట్ పోస్టులకు సంబంధాలు తెగిపోయాయి. స్టీల్ తో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన ఇది. గంగోత్రికి వెళ్లేందుకు నిత్యం వేలాది మంది ఈ వంతెన మార్గం నుంచే ప్రయాణం చేస్తుంటారు. రూ.2.5 కోట్లతో దీన్ని నిర్మించినా ఫలితం లేకపోయింది.

మూడు నెలల క్రితం ఇలాగే వంతెన కూలిపోవడంతో కొత్తది నిర్మించారు. 18 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. ఓ భారీ ట్రక్కు నిండా ఇసుకను నింపుకుని దాటే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ లోడ్ ను తట్టుకోలేక వంతెన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఏప్రిల్ 18 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుండగా, ఈ వంతెన కూలిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారులు యాత్ర కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

More Telugu News