Telugudesam: చంద్రబాబు పర్యటన కేంద్రాన్ని గడగడలాడిస్తుంది : టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

  • ఈ నెల 3,4 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు
  • వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష పేరిట అమిత్ షా మరో కొత్త నాటకం
  • అవినీతికి నిలువుటద్దం జగన్
  • అవినీతిలో మునిగిపోయిన  జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

ఈ నెల 3,4 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారని, ఈ పర్యటన కేంద్రాన్ని గడగడలాడిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష పేరిట బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించరనే ఉద్దేశంతోనే జగన్ ఈ ఎత్తుగడ వేశారని అన్నారు.

ఏపీకి న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వుతున్నట్టు వైసీపీ నేతలు నటిస్తున్నారని, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. అవినీతికి నిలువుటద్దం జగన్ అని, అవినీతిలో మునిగిపోయిన ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని దుమ్మెత్తి పోశారు. కాగా, ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

More Telugu News