Shami: క్రికెటర్ షమీకి భార్యతో కొత్త చిక్కులు...!

  • ఐపీఎల్‌లో షమీని ఆడనివ్వొద్దని యాజమాన్యానికి వినతి
  • అతనికి అక్రమ సంబంధాలున్నాయని ఆరోపణలు
  • షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న ఢిల్లీ జట్టు

కొంతకాలంగా తన భర్తపై సంచలన ఆరోపణలు చేస్తోన్న టీమిండియా క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ నెల 7 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ టోర్నీలో అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో అతన్ని ఆడనివ్వరాదంటూ ఆమె సదరు ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువాని జహాన్ ఇటీవల కలిసింది. "హేమంత్ ఎదుట నా బాధను వినిపించాను. కుటుంబ సమస్యను పరిష్కరించుకునేంత వరకు షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వొద్దని ఆయన్ను కోరాను" అని జహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపింది.

కాగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. షమీకి పలువురు యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతను తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడని జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. వాటితో పాటు ఆమె చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి మాత్రం షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను కలిసేందుకు వచ్చిన జహాన్‌తో మాట్లాడేందుకు షమీ విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News