Hyderabad: రంగారెడ్డి జిల్లాలో అత్యాచారం, హత్య... గంటల్లోనే నిందితుడిని పట్టించిన పోలీస్ డాగ్!

  • కల్లు తాగుతున్న మహిళను పనిప్పిస్తానని తీసుకెళ్లిన విష్ణు
  • జీహెచ్ఎంసీ పార్కులో అత్యాచారం, ఆపై హత్య
  • వెంటనే పట్టించిన డాగ్ స్క్వాడ్

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి సమీపంలోని శాస్త్రీపురంలో జరిగిన హత్యకేసును డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కల్లు కాంపౌండ్ లో కల్లు తాగుతున్న పద్మమ్మ (38) అనే మహిళకు పనిప్పిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లిన విష్ణు అలియాస్ చక్రి ఆమెను, శాస్త్రీపురం సమీపంలోని జీహెచ్ఎంసీ పార్కుకు రాత్రి 9.30 గంటల సమయంలో తీసుకెళ్లి తొలుత అత్యాచారం చేశాడు.

ఆపై బండరాయితో తలపై మోది హత్య చేయడంతో పాటు, ముఖాన్ని గుర్తు పట్టకుండా చేసేందుకు చుట్టూ ఉన్న చెత్తను ఆమెపై వేసి నిప్పంటించి పారిపోయాడు. పార్కులో ఏదో కాలుతున్నట్టు గుర్తించిన సమీప ప్రాంతాల ప్రజలు వచ్చి చూసి, మృతదేహమని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా డాగ్ స్క్వాడ్ ను పిలిపించగా, మృతదేహం వద్ద నుంచి రాఘవేంద్ర కాలనీలోని విష్ణు ఇంటికి కుక్క వెళ్లింది. దీంతో పోలీసులు విష్ణును అరెస్ట్ చేసి విచారించగా, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసును రిజిస్టర్ చేశామని, మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News