Mukesh Ambani: ముకేశ్ అంబానీ కాబోయే కోడలు సంపద రూ.120 కోట్లు!

  • రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా
  • మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ లాంటి అత్యుత్తమ కార్లు ఆమె సొంతం
  • 2014లో రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి కాబోయే కోడలు శ్లోకా మెహతాకి సంపద బాగానే ఉంటుందని అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, అదెంత? అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ దిశగా ఫినాప్ సంస్థ ఆమె సంపద, ఇప్పటివరకు ఆమె నిర్వర్తించిన బాధ్యతలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను బహిర్గతం చేసింది. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా నికర సంపద రూ.120 కోట్లని తెలిపింది. మినీ కాపర్, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ లాంటి ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను ఆమె కలిగి ఉన్నారని పేర్కొంది.

ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేశారని ఫినాప్ తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్ మెహతా రోజీ బ్లూ ఇండియా కంపెనీకి ఎండీ. ఈ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే రోజీ బ్లూ ఫౌండేషన్‌కు 2014లో శ్లోకా మెహతా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎన్‌జీవోలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 'కనెక్ట్ ‌ఫర్' అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. కాగా, తన చిన్ననాటి స్నేహితుడు, ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని శ్లోకా మెహతా వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి విదితమే.

More Telugu News