Visakhapatnam: అమ్మాయిలను నమ్మి నాలా మోసపోవద్దు.. ఆత్మహత్యకు ముందు యువకుడి సెల్ఫీ వీడియో

  • మేనకోడలితో నాలుగేళ్ల క్రితం వివాహం
  • మరో అమ్మాయితో రహస్య వివాహం
  • అనకాపల్లిలో ఘటన

‘ఆమె నా మనసుతో ఆడుకుంది. నాలాగా అమ్మాయిలను నమ్మి మరెవరూ మోసపోవద్దు’ అంటూ ఆత్మహత్యకు ముందు ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న చోడవరానికి చెందిన ఎలిశెట్టి రాజశేఖర్ (30)కు మేనకోడలు కృపారాణితో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. అదే సమయంలో గోవాడ అంభేరుపురానికి చెందిన అశ్వినితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న రాజశేఖర్ ఆమెను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు.

అశ్విని ప్రవర్తనలో ఇటీవల మార్పు కనిపించడంతో రాజశేఖర్ ప్రశ్నించాడు. దీంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాజశేఖర్ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి చేరుకున్న రాజశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతకంటే ముందు 5 నిమిషాల నిడివి ఉన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు వివరించాడు. తల్లి, భార్య తనను క్షమించాలని వేడుకున్నాడు. వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టానని కన్నీరు పెట్టుకున్నాడు. అశ్విని తన మనసుతో ఆడుకుని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలా మరెవరూ మోసపోవద్దని యువకులను హెచ్చరించాడు. అనంతరం రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News