Gujarath: గుర్రంపై తిరుగుతున్నాడని దళిత యువకుడి హత్య!

  • నాలుగు నెలల క్రితం గుర్రాన్ని కొనుగోలు చేసిన ప్రదీప్
  • దళితులు గుర్రంపై తిరగడాన్ని సహించమంటూ హెచ్చరించిన అగ్రవర్ణ యువకులు
  • హెచ్చరికలను పట్టించుకోని దళిత యువకుడు 

మీసం పెంచినందుకు గతంలో దళితులపై దాడులు జరగగా, తాజాగా గుర్రమెక్కి తిరుగుతున్నాడని ఓ దళిత యువకుడ్ని హతమార్చిన ఘటన గుజరాత్‌ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... భావ్‌ నగర్‌ కి చెందిన ప్రదీప్‌ రాఠోడ్‌ (21) అనే యువకుడు నాలుగు నెలల క్రితం 30,000 రూపాయలతో గుర్రాన్ని కొనుగోలు చేశాడు. దీంతో అప్పట్లోనే దళితులు గుర్రాలు కొనుగోలు చేయడం, వాటిపై తిరగడాన్ని ఎంతమాత్రం ఒప్పుకోమంటూ అగ్రవర్ణానికి చెందిన కొందరు యువకులు హెచ్చరించారు.

అవేమీ పట్టించుకోని ప్రదీప్ దానిపై తిరగడం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో గుర్రంపై వస్తున్న ప్రదీప్ పై కొందరు యువకులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రదీప్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రదీప్ ను హతమార్చిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని తేల్చి చెప్పారు. 

More Telugu News