kiran bedi: తాను ఏపీకి గవర్నర్‌గా వెళుతున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన కిరణ్ బేడీ

  • ఆ ప్రచారంలో నిజం లేదు 
  • అవన్నీ నిరాధారం
  • పుదుచ్చేరిలో నేను చేపట్టిన కార్యక్రమాలతో మంచి పేరు వస్తోంది
  • లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా పూర్తికాలం కొనసాగుతా

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కిరణ్ బేడీ స్పందించి, ఆ వార్తలను ఖండించారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వస్తోన్న ప్రచారంలో నిజం లేదని, అవన్నీ నిరాధారమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో తాను చేపట్టిన కార్యక్రమాలతో మంచి పేరు వస్తోందని, తాను అక్కడే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా పూర్తికాలం కొనసాగుతానని అన్నారు. ఏపీకే కాకుండా ఇతర ఏ రాష్ట్రానికీ గవర్నర్‌గా వెళ్లబోనని తేల్చి చెప్పారు.  

కాగా, పుదుచ్చేరిలో కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఏ మాత్రం పడటం లేదన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవహారాల్లో కిరణ్ బేడీ జోక్యం గురించి ఆయన పలుసార్లు మండిపడ్డారు. మరోవైపు ఏపీ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ పదవీకాలం ఇప్పటికే ముగిసినప్పటికీ మరోసారి పొడిగించారు. ఏపీలో కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు లేఖ కూడా రాశారు. దీంతో కిరణ్ బేడీని ఏపీ గవర్నర్‌గా పంపి, పుదుచ్చేరిలో కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ని నియమిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే తెలంగాణకు కూడా కొత్త గవర్నర్‌ వస్తారని ప్రచారం జరిగింది. 

More Telugu News