Chandrababu: కేంద్రంపై దాడి చేయడమే సీఎం పనిగా పెట్టుకున్నారు : సోము వీర్రాజు

  • కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 80 యంత్రాలు పనిచేయట్లేదు
  • ఆ యంత్రాలు పనిచేస్తున్నట్టుగా సీఎం డ్యాష్ బోర్డులో ఉంది
  • క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంపై దాడి చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 80 యంత్రాలు పనిచేయడం లేదని, ఈ యంత్రాల మెయింటెనెన్స్ బాధ్యతలు టీబీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ గా ఇచ్చారని, మొబిలైజేషన్ ద్వారా 103 కోట్లు, బిల్లుల రూపంలో రూ.45 కోట్లు ఇచ్చారని అన్నారు.

ఆ యంత్రాలు పనిచేయకున్నప్పటికీ సీఎం డ్యాష్ బోర్డులో పనిచేస్తున్నట్టు చూపిస్తోందని, టీబీఎస్ సంస్థ కాంట్రాక్టును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోందని, టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ ఆర్జీఎస్ లో జరుగుతున్న అవినీతిని బయటపెడతామని అన్నారు. రాష్ట్రంలోని అవినీతి చూసి విదేశీ సంస్థలు రావడం లేదని, ముఖ్యంగా విదేశీ బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆరోపించారు.

More Telugu News