isro: ఇస్రో 'జీశాట్-6ఏ' ప్రయోగం విజయవంతం.. నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహం

  • శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి ప్రయోగం
  • 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి జీశాట్‌-6ఏ
  • హర్షం వ్యక్తం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-6ఏ ప్రయోగం విజయవంతమైంది. ఈ రోజు సాయంత్రం 4.56 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్.. 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఇస్రో ఛైర్మన్‌ కే శివన్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఇస్రో అధికారులు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో రాకెట్ రెండో దశలో అధిక విస్పోటనం కలిగిన వికాస్ ఇంజిన్, ఎలక్ట్రోమెకానికల్ ఆక్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

More Telugu News