Mohammad shami: నన్నే బెదిరిస్తావా.. నీ సంగతి కోర్టులో తేలుస్తా: షమీకి భార్య హసీన్ వార్నింగ్

  • ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షమీ
  • పరామర్శించేందుకు కూతురుతో కలిసి వెళ్లిన హసీన్ జహాన్
  • కలవడానికి షమీ నిరాకరణ

కారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని కలిసేందుకు వెళ్లిన అతడి భార్య హసీన్ జహాన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎంతైనా తన భర్తే కదా అని పలకరించేందుకు వెళ్లిన తనను కలిసేందుకు షమీ నిరాకరించాడని, ఇక కోర్టులోనే తేల్చుకుంటామని హసీన్ హెచ్చరించారు.

‘‘ప్రమాదంలో గాయపడిన షమీని కలవాలని అనుకున్నా. కానీ నన్ను కలిసేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు, నన్ను బెదిరించాడు. ఇక మేమిద్దరం కోర్టులోనే కలుసుకుంటాం’’ అని తేల్చి చెప్పారు. షమీ తన కుమార్తెతో ఆడుకున్నాడని, కానీ తనను మాత్రం కలిసేందుకు నిరాకరించాడని, షమీ తల్లి అతడికి బాడీగార్డులా పనిచేస్తున్నారని హసీన్ ఆరోపించారు.

మార్చి 24న షమీ డెహ్రాడూన్ నుంచి కారులో ఢిల్లీ వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న అతడిని కలవాలనుకుంటున్నట్టు హసీన్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. తనకు జరిగిన అన్యాయంపైనే పోరాడుతున్నాను తప్ప, అతడు ప్రమాదం పాలవ్వాలని తానెప్పుడూ కోరుకోలేదని హసీన్ పేర్కొన్నారు. అతడు తనను వద్దనుకుంటున్నా, తాను మాత్రం అతడిని ప్రేమిస్తూనే ఉన్నానని, ఎందుకంటే, అతడు తన భర్త అని హసీన్ రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన హసీన్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టులో కలుసుకుందామంటూ షమీకి హెచ్చరికలు పంపారు.

More Telugu News