Thieves: దొంగల చేతిలో బాధితుడిగా మారిన ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్!

  • పోలీసు మాజీ బాసుకే దొంగల టోకరా
  • డ్రైవర్ దృష్టి మరల్చి కారు నుంచి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
  • చోరుల కోసం గాలిస్తున్న పోలీసులు

పోలీస్ కమిషనర్‌గా ఢిల్లీ పోలీస్ ఫోర్స్‌ను సమర్థవంతంగా నడిపించిన బీకే గుప్తా ఇప్పుడు దొంగల చేతిలో బాధితుడిగా మారారు. మంజుకా టిల్లా ప్రాంతంలో దొంగలు గుప్తా కారులోని ఐప్యాడ్, నగదు సహా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

గుప్తా చండీగఢ్ వెళ్తుండగా కొద్ది దూరం ప్రయాణించాక కారును రోడ్డు పక్కన ఆపాలని డ్రైవర్‌ను కోరారు. ఆ  తర్వాత కాసేపటికి తిరిగి కారెక్కిన గుప్తా లోపల ఉండాల్సిన విలువైన వస్తువులు మాయవడాన్ని గుర్తించారు. గుప్తా కారు దిగినప్పుడు డోర్ లాక్ చేశారని, అయితే తిరిగి కారెక్కినప్పుడు చూసుకుంటే డోరు తెరిచి ఉందని డ్రైవర్ పేర్కొన్నాడు.

దొంగలు కారు డ్రైవర్ దృష్టిని మరల్చి కారులోని ఐప్యాడ్, నగదు సహా ఇతర వస్తువులను దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీలు లేకపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.

More Telugu News