KCR: నా హత్యకు కేసీఆర్ కుట్ర... సీబీఐ విచారణ జరిపించాలని నరేంద్ర మోదీకి మంద కృష్ణ లేఖ

  • దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ
  • మాట తప్పినందుకు విమర్శిస్తే కక్ష పెంచుకున్నారు
  • చంపించాలని చూస్తున్నారంటూ మంద కృష్ణ ఆరోపణలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటారని వాగ్దానం చేసిన కేసీఆర్, మాట తప్పారని, దాన్నే గుర్తు చేసి విమర్శించినందుకు కక్షకట్టారని ఆరోపించారు.

ప్రధాని కార్యాలయానికి స్వయంగా వెళ్లిన మంద కృష్ణ తన లేఖను కార్యాలయంలో అందించారు. గత సంవత్సరం జూలై 8వ తేదీన తాను సూర్యాపేట నుంచి వరంగల్ కు వెళుతుండగా దాడి జరిగిందని గుర్తు చేశారు. ఎస్సీల వర్గీకరణపై తమ పోరాటానికి స్పందిస్తూ, ఈ డిమాండ్ సాధనకు అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకు వెళతానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, ప్రశ్నించిన తనను రెండు సార్లు అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈనెల 14న అసెంబ్లీలో మాట్లాడుతూ, తనను అణచివేస్తానని కేసీఆర్ ప్రకటించారని, తన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించి నిజాన్ని తేల్చాలని మంద కృష్ణ కోరారు.

More Telugu News