Karnataka Assembly Elections: కర్ణాటక మళ్లీ కాంగ్రెస్‌దే...ఆసక్తి రేకెత్తిస్తోన్న సర్వే వివరాలు

  • కర్ణాటకలో కాంగ్రెస్‌కు గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు
  • బీజేపీి కూడా ఈసారి 70 సీట్లు గెలుచుకునే ఛాన్స్
  • జేడీ(ఎస్) మాత్రం మరింత బలహీనపడే అవకాశం
  • కర్ణాటకలోని 154 నియోజకవర్గాల్లో ఓటర్ల మనోగతం తెలుసుకున్న సీ-ఫోర్ సర్వే సంస్థ

ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఈసారి కూడా అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, గత ఎన్నికల్లో కంటే ఈసారి ఆ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ కూడా మెరుగ్గా రాణిస్తుందని, జేడీ (ఎస్) మాత్రం మరింతగా బలహీనపడుతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. సీ-ఫోర్ సంస్థ ఈ నెల 1-25 తేదీల మధ్య ఈ సర్వేని చేపట్టింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గాను 154 నియోజకవర్గాల్లో దాదాపు 22,357 మంది ఓటర్లను సర్వే సంస్థ పలకరించి వారి మనోగతం తెలుసుకుంది.

2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేశామని, ఆ పార్టీకి రెండు సీట్లు అదనంగా అంటే 122 సీట్లు వచ్చాయని సీ-ఫోర్ తెలిపింది. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి 126 సీట్లు వస్తాయని, గతంలో 40 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి 70 సీట్లు గెలుచుకుంటుందని, గతంలో 40 సీట్లను సాధించిన జేడీ(ఎస్) మాత్రం ఈసారి 27 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న ఓటర్లు ఎక్కువగా తాగునీటి సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారని సీ-ఫోర్ తెలిపింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే మళ్లీ సీఎం కావాలని దాదాపు 45 శాతం మంది కోరుకుంటున్నారని సీ-ఫోర్ వెల్లడించింది. సీఎంగా బీజేపీకి చెందిన బీఎస్ యడ్యూరప్పకు 26 శాతం మంది, జేడీ(ఎస్) హెచ్‌డీ కుమారస్వామికి 13 శాతం మంది అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News