తప్పుడు వార్తలకు పదేళ్ల కారాగారం...! కొత్త చట్టానికి మలేసియా సర్కార్ కసరత్తు

  • తప్పుడు వార్తలకు పదేళ్ల జైలు లేదా భారీ జరిమానా విధింపుకు మలేసియా సర్కార్ ప్రతిపాదన
  • కొత్త చట్టం తీసుకురావడానికి కసరత్తు
  • ఆగస్టులో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని రజాక్ ప్రభుత్వం ఇలా చేస్తోందని విపక్షాల విమర్శలు
తప్పుడు వార్తలు రాసిన వారికి, అలాంటి వార్తలను ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలుశిక్ష విధించేలా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మలేసియా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదేళ్ల కారాగారం లేదా 5 లక్షల రింగిట్‌ల (128000 డాలర్లు లేదా దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండింటినీ విధించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఆగస్టులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని హక్కుల కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష ఎంపీ శాంటిగో తీవ్రంగా విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై ఎవరూ విమర్శలు చేయకుండా చేయడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగించదని భరోసా కల్పిస్తుండటం గమనార్హం. మరోవైపు కొత్తగా తీసుకురాబోయే చట్టంలోని నిబంధనలను విదేశాలకు వెళ్లినప్పుడు ఉల్లంఘించినా సరే వారు మలేసియాలో శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
Go Back to Shorts
Malaysia
Prime Minister Najib Razak
Ringgit

More Telugu News