vijaya sai reddy: విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారు : మంత్రి సోమిరెడ్డి

  • మోదీ కాళ్లు పట్టుకున్న విషయం అందరికీ తెలుసు
  • ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నాటకాలాడుతోంది
  • రాయలసీమకు హై కోర్టు బెంచ్, కడప స్టీల్ ప్లాంట్ సాధిస్తాం
  • వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తాం 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ కాళ్లను విజయసాయిరెడ్డి పట్టుకున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటున్న వైసీపీ, ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తామంటోందని విమర్శలు గుప్పించారు. 

టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే పార్టీలు బీజేపీకి మద్దతిస్తాయంటూ ఈరోజు సాక్షి దినపత్రికలోనే రాశారని అన్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాయలసీమకు హైకోర్టు బెంచ్, కడప స్టీల్ ప్లాంట్ ను సాధిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండానే రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, టీడీపీ నేత సీఎం రమేశ్ మాట్లాడుతూ, వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, అవినీతి కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్క్రిప్ట్ నే చంద్రబాబుకు అమిత్ షా పంపారని ఆయన విమర్శించారు.

More Telugu News