jd seelam: రెండేళ్ల క్రితమే చంద్రబాబు ఈ పని చేసి ఉంటే ఫలితం దక్కేది: జేడీ శీలం

  • బీజేపీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి
  • రెండేళ్ల క్రితమే చంద్రబాబు పోరాడి ఉంటే ఫలితం దక్కేది
  • ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ జేడీ శీలం చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటని ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస ఖర్చును కూడా పూర్తిగా కేంద్రమే భరించాలని విభజన హామీలో ఉందని చెప్పారు.

టీడీపీ, బీజేపీ పోరు వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. పరిపాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రెండేళ్ల క్రితమే చంద్రబాబు పోరాడి ఉంటే ఫలితం దక్కేదని చెప్పారు. 2019లో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందని... యూపీయే ప్రభుత్వం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. హోదా అంశాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టలేదని అన్నారు. చట్టంలో లేకున్నా ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పారు. బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. 

More Telugu News