Tejaswi Yadav: 'మా నాన్న ప్రాణాలకు ముప్పు'...లాలూ ప్రసాద్ తనయుడి సంచలన ఆరోపణలు

  • బీజేపీ కుట్ర పన్నుతోందంటూ తేజస్వి యాదవ్ ఆరోపణ
  • దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు అనంతరం లాలూ తనయుడి సంచలన ఆరోపణలు
  • సీబీఐ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తామని వెల్లడి

తన తండ్రి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ఈ రోజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ (భాజపా) కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.

"బీజేపీ చేస్తున్న కుట్రను చూస్తుంటే, లాలూజీ ప్రాణాలకు ముప్పు ఉందని నేను కచ్చితంగా చెప్పగలను" అని ఆయన అన్నారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులో లాలూకి రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు పద్నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన నేపథ్యంలో తేజస్వి చేసిన ఆరోపణలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

14 ఏళ్ల కారాగారంతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని తేజస్వి చెప్పారు. హైకోర్టులో ఈ కుంభకోణానికి సంబంధించిన మొత్తం నాలుగు కేసుల్లో వచ్చే తీర్పు ఆధారంగా తదుపరి వ్యూహాన్ని రచించుకుంటామని ఆయన అన్నారు. కాగా, దాణా కుంభకోణానికి సంబంధించిన ఈ నాలుగో కేసు 1990ల్లో దమ్కా కోశాగారం నుంచి లాలూ మోసపూరితంగా రూ.3.13 కోట్లు విత్ డ్రా చేశారన్న ఆరోపణలకు సంబంధించినది.

More Telugu News