Guntur District: భార్యపై కోపంతో ఇంటికి నిప్పుపెడితే.. 20 లక్షల ఆస్తిని దహించివేసింది!

  • భార్యతో గొడవపడి సొంతింటికి నిప్పు పెట్టిన వీరాంజనేయులు
  • పూరిల్లు కావడంతో నాలుగు గడ్డి వాములు, మూడు కోళ్ల ఫారాలు, ఒక సెల్ టవర్ కు వ్యాపించిన మంటలు
  • 20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా

భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త సొంత ఇంటికి నిప్పుపెడితే అది 20 లక్షల రూపాయల ఆస్తిని దహించివేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని పెదకంచర్లకు చెందిన మద్దినేని వీరాంజనేయులు, మల్లీశ్వరి దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వీరాంజనేయులు తాము నివసిస్తున్న పూరింటికి నిప్పుపెట్టాడు.

మంటలు శరవేగంగా వ్యాపించి పక్కనే ఉన్న చినఆంజనేయులు, పెదఆంజనేయులకు చెందిన నాలుగు వరిగడ్డి వాములు, చిరుమామిళ్ల ఆంజనేయులుకు చెందిన మూడు కోళ్ల ఫారాలు, రిలయన్స్ సెల్‌ టవర్‌ కు అంటుకుని దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. అప్పటికే సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేశారు. దీంతో ఆందోళన చెందిన వీరాంజనేయులు, మళ్లీశ్వరి పరారయ్యారు.

More Telugu News