Congress: చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని మోదీకి తాక‌ట్టు పెట్టారు: ర‌ఘువీరారెడ్డి

  • చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలి
  • ప్రత్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హ‌మీల అమ‌లు పోరాటానికి క‌లిసి రావాలి
  • ర‌హదారుల దిగ్బంధం విజ‌య‌వంతం చేసిన అంద‌రికీ  ధ‌న్య‌వాదా‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని, ప్రత్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హ‌మీల అమ‌లు పోరాటానికి క‌లిసి రావాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి సూచించారు. ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హా‌మీల అమలుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ, ప్రత్యేక హోదా సాధన సమితితో క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌లు ఈరోజు రోడ్డెక్కి జాతీయ ర‌హ‌దారులపై బైరాయించి, నిర‌స‌న వ్య‌క్తం చేశారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, విద్యార్థి నాయ‌కులు, మేధావులు, న్యాయ‌వాదులు, మ‌హిళలు, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులందరికి ర‌ఘువీరారెడ్డి ధ‌న్య‌వాదా‌లు తెలిపారు. ఏఐసీసీ ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టం హామీల‌కు క‌ట్టుబ‌డి ఉందన్నారు. అందుకు నిద‌ర్శ‌న‌మే డిల్లీలో జ‌రిగిన ప్లీన‌రీలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని తీర్మానం చేసిన విష‌యం గుర్తు చేశారు. చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని మోదీకి తాక‌ట్టు పెట్టి 4 సంవ‌త్స‌రాలు బీజేపీతో క‌లిసి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని, ఇప్ప‌టికైనా బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి క‌లిసి రావాల‌ని సూచించారు.

More Telugu News