Nara Lokesh: పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా?

  • లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్
  • పరువునష్టం దావా వేద్దామని సూచిస్తున్న నేతలు
  • ఆ విషయం పార్టీ చూసుకుంటుందన్న లోకేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేయాలా? వద్దా? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తమకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని... ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు. పవన్ దిగజారుడు రాజకీయాలు బాధాకరమని... ఆయన వద్ద తన ఫోన్ నంబర్ ఉందని... ఏవైనా ఆధారాలు ఆయన వద్ద ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి ప్రశ్నించి ఉండొచ్చుకదా? అని అన్నారు. తాము ప్రతి ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల కన్నా చిల్లిగవ్వ ఎక్కువున్నా తీసుకోండని చెప్పారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రమంతా అవినీతిలో కూరుకుపోయిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. శేఖర్ రెడ్డితో లోకేష్ కు లింకులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, అసత్య ఆరోపణలు చేసి, గౌరవానికి భంగం కలిగించిన పవన్ పై పరువునష్టం దావా వేయాలంటూ కొందరు నేతలు సూచిస్తున్నారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ, ఆ అంశాన్ని పార్టీ చూసుకుంటుందని చెప్పారు.

More Telugu News