kethi reddy: ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ గొప్ప ప్రజానేత : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ పై ప్రశంసలు 
  • అలాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం
  • కేసీఆర్ నాయకత్వంలో దక్షిణాది నాయకులందరూ నడవాలి
  • ఓ ప్రకటన విడుదల చేసిన కేతిరెడ్డి

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తమ సత్తా ఏంటో చాటుతామని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ కంటే ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ గొప్ప ప్రజానేత అని ప్రశంసించారు.

ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా బీజేపీ ఈరోజున ఈ దశకు చేరిందని, ఉద్యమ నేపథ్యంలో పుట్టిన పార్టీ  టీఆర్ఎస్ అని, మతాలు, కులాలు అజెండాతో వచ్చిన పార్టీ కాదని అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఉత్తరాది నాయకత్వానికి ఒక చెంప పెట్టు లాంటిదని అన్నారు. కేసీఆర్ లాంటి నిజాయతీ గల నాయకుడు ఈ దేశానికి చాలా అవసరమని, గుణాత్మకమైన మార్పు నిమిత్తం కొత్త రాజకీయ సమీకరణాల అవసరం ఉందన్న కేసీఆర్ నాయకత్వంలో దక్షిణాది నాయకులందరూ నడవాలని, వచ్చే ఎన్నికల్లో ఉత్తరాది వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

More Telugu News