Chandrababu: నా మనవడు కలిపిన పచ్చడినే ఇవాళ తింటున్నా: చంద్రబాబు

  • దేవాన్ష్ ఉగాది పచ్చడిని స్వయంగా కలిపాడు
  • రెండు సార్లు తిని ఇక చాలన్నాడు
  • విజయవాడ ఉగాది వేడుకల్లో చంద్రబాబు

ఇవాళ తన మనవడు దేవాన్ష్ కలిపిన ఉగాది పచ్చడినే తాను తొలుత తిన్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఆరు రుచుల్లోనే జీవితసారం ఇమిడి ఉందని అన్నారు. అందులోని వేపపువ్వు చేదు వల్ల తన మనవడికి పెద్దగా నచ్చినట్టు లేదని, రెండు సార్లు తిని, ఇక సరిపోయిందని చెప్పాడని చంద్రబాబు తెలిపారు.

చింతపండు పులుపుతో నేర్పుగా వ్యవహరించాలన్న సంకేతం ఉందని, పచ్చి మామిడి రుచితో కొత్త సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. కారంతో సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందని, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఉగాది పచ్చడిలో ఎంతో నిగూఢార్థం ఉందని, నేడు పంచాంగ శ్రవణాన్ని ప్రతి ఒక్కరూ వినాలని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయన్న విషయాలను తెలుసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News